ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు కరెంట్ కష్టాలు,కమర్షియల్ మీటర్ల డీడీలు తీయాలని అంటున్న విద్యుత్ అధికారులు,డొమెస్టిక్ మీటర్ల సాంక్షన్ ఇవ్వాలని లబ్దిదారుల డిమాండ్
NTODAY NEWS: భువనగిరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదలకు ఊరట కల్గిస్తుంది. పేదల స్వంత ఇంటి కలను నిజం చేయడానికి, స్వంత స్థలాలు కల్గి ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా అందించి సుమారు 60 గజాల స్థలంలో ఒక హాల్, వంటగది, మరియు బెడ్రూం అటాచ్డ్ బాత్ రూం నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో పేదరికంతో పూరి గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో, చాలా కాలంగా కిరాయి ఇండ్లల్లో ఉంటున్న వారిని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులుగా గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల సంక్షేమ పథకాన్ని అందిస్తుంది.అధికారులు గుర్తించిన చాలా మంది లబ్ధిదారులు ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్దిదారులు గృహ విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ మీటర్ల కోసం అధికారులను సంప్రదిస్తే విద్యుత్ శాఖ అధికారులు కమర్షియల్ మీటర్లు తీసుకోవాలని అంటున్నారు. అందుకు ఒక్క కమర్షియల్ మీటర్లు సాంక్షన్ కొరకు రూ 4050/- (ఇంటి స్థలం కొనుగోలు డాక్యుమెంట్స్ ఉంటే) ఒకవేళ ఇంటి స్థలానికి సంబంధించి నోటరీ డాక్యుమెంట్స్ ఉంటే రూ 7250/- డీడీ తీయాలని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గృహ అవసరాల కోసం ఇంటి స్థలానికి సంబంధించి కొనుగోలు డాక్యుమెంట్స్ ఉంటే రూ 2825/-, ఇంటి స్థలానికి సంబంధించి నోటరీ డాక్యుమెంట్స్ ఉంటే రూ 3650/- రూపాయల డీడీ చెల్లించాల్సి ఉంది. కానీ విద్యుత్ శాఖ అధికారుల ధోరణితో, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు కొత్తగా కరెంట్ కష్టాలు వస్తున్నాయి.ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి,ఇళ్లు లేని నిరుపేదలు నిర్మించుకునే ఇందిరమ్మ ఇళ్ళకు డొమెస్టిక్ మీటర్లు మంజూరు చేయాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు వేడుకుంటున్నారు.లబ్ధిదారులకు గృహ అవసరాల విద్యుత్ మీటర్లు మాత్రమే ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్వి నియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తుంటే , మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు ఇందిరమ్మ లబ్ధిదారులు కమర్షియల్ మీటర్లు తీసుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇట్టి విషయమై విద్యుత్ శాఖ అధికారుల ఆలోచన విరమించుకోవాలని, లేనిచో జిల్లా కలెక్టరేట్ ను ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గృహ అవసరాల విద్యుత్ ( డొమెస్టిక్) కేటగిరీ 1 కింద 2 కిలోవాట్ల విద్యుత్ ను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాదారులకు సాంక్షన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.













