భూ సమస్యలు ఉన్న ప్రతి రైతుకు భూ భారతి చట్టం వరం– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
N TODAY NEWS: మోట కొండూరు మండలం, ఏప్రిల్ 28
సామాన్యులకు చట్టాలు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశ్యం తో ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
సోమవారం మోటకొండూరు మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)
వీరారెడ్డి తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం రైతులకు వరం అన్నారు.
భూభారతి పై రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని , భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు .
భూభారతి చట్టంలో వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ భద్రత నిచ్చేందుకు ప్రభుత్వం అనేక అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూభారతి చట్టం రైతుల భూములకు భరోసా కల్పిస్తుందన్నారు. ధరణిలో పరిష్కారం కాని భూ సమస్యలు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతాయన్నారు.
ప్రతి మనిషికి ఆధార్ మాదిరిగానే ప్రతి ఒక్కరి భూమికి రానున్న రోజుల్లో ప్రభుత్వం భూధార్ కార్డులు అందిస్తుందన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులు భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను సులభతరంగా పరిష్కరిస్తారని అన్నారు. ఇక పై భూ సమస్యలనేవి ఉండవని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా అందించడంతోపాటు భూ సమస్యల పరిష్కారానికి రెండు అప్పీల్ వ్యవస్థ ఉంటుందని ఆర్డీఓ పరిధిలో కాకపోతే కలెక్టర్ స్థాయిలో పరిష్కరించుకునేందుకు ఈ చట్టం లో అవకాశం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణ రెడ్డి, సంబందిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.