తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దోపుచర్ల లోని యూనివర్సల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో నిర్వహించిన చేతిరాత పోటీలలో దూబచర్లలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని బోడిగడ్ల అను ప్రథమ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా శ్రీ సంఘమిత్ర విద్యాలయంలో స్కూల్ డైరెక్టర్ అంబటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో బోడిగడ్ల అను “బెస్ట్ హ్యాండ్ రైటింగ్ స్టూడెంట్ అవార్డు”ను అందుకుంది.కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ చేతిరాత నిపుణులు, యూనివర్సల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్ పవన్ కుమార్, సూర్య జువెలరీస్ అధినేత గాదె రాజా, మరియు ఎల్ఐసి అడ్వైజర్ ఘంటా సుభాష్ పాల్గొని, విజేతకు బహుమతిని అందజేశారు.ఈ సందర్భంగా సిహెచ్ పవన్ కుమార్ మాట్లాడుతూ, “విద్యార్థి దశలో చేతిరాతను మెరుగుపరచుకోవడం వల్ల పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే కాకుండా, మంచి ప్రవర్తన అలవడుతుంది. ఇది విద్యార్థులను జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా ప్రోత్సహిస్తుంది” అని అన్నారు.ఈ విజయానికి శ్రీ సంఘమిత్ర విద్యాలయ సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.
