విశాఖ సమ్మిట్లో కార్మికుల సంక్షేమంపై చర్చించండి
NTODAY NEWS:అమరావతి
వి.శ్రీనివాసరావు
రాష్ట్రాభివృద్ధికి వచ్చే పెట్టుబడులను సిపిఎం ఆహ్వానిస్తుంది
రైతులకు, ప్రజలకు నష్టం చేస్తే ఊరుకోం
అమరావతి: విశాఖ సిఐఐ సమ్మిట్లో ఉపాధి, ఉద్యోగాల కల్పన, కార్మిక సంక్షేమంపైనా ప్రత్యేకంగా చర్చ జరగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ బాలోత్సవభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కె.ప్రభాకరరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడులు సదస్సులో పేరుతో జరిగేవన్నీ ప్రభుత్వం, కార్పొరేట్ల భాగస్వామ్యంగా ఉంటున్నాయి తప్ప ప్రజల భాగస్వామ్యానికి చోటు ఉండటం లేదని అన్నారు. గతంలోనూ అనేక సదస్సులు జరిగాయని, వాటిద్వారా ఉపాధి ఎంత వచ్చిందో బయటపెట్టాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వచ్చే పెట్టుబడులను సిపిఎం ఆహ్వానిస్తుందని చెప్పారు. గతంలో పెట్టు బడులు వచ్చాయని పెద్దఎత్తున ప్రచారం చేసినా ఉపాధి పెరగలేదని, స్థానికులకు పనులు దొరకలేదని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా స్టీలు ప్లాంటులో ఆరువేల ఉద్యోగాలను తీసేశారని తెలిపారు. ఇప్పటికే విశాఖ ఐటి భవనాలు పరిశ్రమలు రాక ఖాళీగా ఉన్నాయన్నారు. గంగవరం పోర్టులో స్థానికులను తీసుకుని తరువాత తొలగించారని అన్నారు. లెక్కల్లో చూపించడానికే ఇలాంటిది చేశారని పేర్కొన్నారు. నిజంగా అభివృద్ధిని కోరుకుంటే ప్రజలను, కార్మికులను అన్నింటిలో భాగస్వాములను చేయాలని అన్నారు. అప్పుడే పెట్టుబడుల సదస్సు లకు విలువ ఉంటుందన్నారు. కేవలం కార్పొరేట్ల కోసమే సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వం వ్యవహరించకూడదని, రాష్ట్రం, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు.
బాంబ్ బ్లాస్ట్ కారకులకు కఠినంగా శిక్షించాలి
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో బాంబ్ బ్లాస్ట్ ఘటనలో మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని చెప్పారు. ఈఘాతుకానికి కారకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఇంటిలిజెన్స్, రాజకీయ వైఫల్యం ఉందని తెలిపారు. పుల్వామా, పెహల్గాంతోపాటు అనేకచోట్ల ఉగ్రదాడులు జరిగాయని వీటిని గుర్తించడంలోనూ ప్రజల ప్రాణాలు కాపాడటంతోనూ కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. పెహల్గాం ఉగ్రవాదులను ఇప్పటి వరకూ పట్టుకోలేదని పేర్కొన్నారు. సర్టికల్ స్ట్రైక్స్ చేశామని, ఉగ్రవాదాన్ని అంతమొందించామని బిజెపి ప్రచారం చేసుకుంటోంది మినహా వాస్తవంగా అణచివేయలేదని పేర్కొన్నారు. ఉగ్రదాడులు జరుగుతాయనే సమాచారంతో తనిఖీలు చేస్తున్న కేంద్రం ముందుగానే వాటిని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. ఇలాంటి సమయాల్లో మతాన్ని టార్గెట్ చేసుకుని ప్రచారం చేయడం వల్ల వైషమ్యాలు పెరుగుతున్నాయి మినహా ఉగ్రవాదం తగ్గదని చెప్పారు.. ఇప్పటికైనా కేంద్రం స్పందించి అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉగ్రవాద నివారణకు అవసరమైన సలహాలు సూచనలు తీసుకుని వాటిని అమలు చేయాలని కోరారు.
నష్టపోయిన రైతులకు పరిహారం ఎగ్గొట్టేలా చర్యలు : కె. ప్రభాకర రెడ్డి
మొంథా తుఫానులో నష్టపోయిన రైతులకు పరిహారం ఎగ్గొట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డి అన్నారు. పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని తొలుత చెప్పిన ప్రభుత్వం ఎన్యుమరేషన్లో తగ్గించుకుంటూ వస్తోందని అన్నారు. వరి, అరటి, మొక్కజన్న, పసుపు వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ సమయంలో రైతుల సంఖ్యను తగ్గిస్తున్నారని తెలిపారు. గతంలో ఉచిత పంటల బీమా వల్ల రైతులకు ఉపయోగం కలిగందని, ప్రస్తుతం అది లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అలాగే సిసిఏ అనుసరిస్తున్న విధానం వల్ల పత్తిరైతులకు అన్యాయం జరుగుతోందని, నిబంధనలు మార్చాలని డిమాండు చేశారు. మొక్కజన్న రైతులను ఆదుకోవాలని కోరారు. పంటలు దెబ్బతిన్న రైతులు, కౌలు రైతులు అందరినీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్ఐఆర్ లేదన్నారు అమలు చేస్తున్నారు : వై. వెంకటేశ్వరరావు
ఇటీవల రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించిన సమయంలో ఎస్ఐఆర్ లేదని స్పష్టంగా చెప్పారని, కేంద్రం ఇచ్చిన లిస్టులోనూ రాష్ట్రం పేరు లేదని అన్నారు. అయినా ఇప్పుడు అమలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అన్నారు. ఎస్ఐఆర్ ఆలోచనను విరమించుకోవాలని తెలిపారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి విజ్ఞాపనపత్రం ఇచ్చామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని తెలిపారు. బెల్టుషాపులు ఎత్తేస్తామని చెప్పారని, ఆచరణలో ఎద్దఎత్తున వ్యాపారాలు జరుగుతున్నాయన్నారు. వీటిపై మహిళల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, వాటిిపై జరిగే ఆందోళనలకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
16న ఎస్ఐఆర్పై రౌండ్టేబుల్
రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలును నిలిపివేయాలని కోరుతూ ఈ నెల 16న విజయవాడలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వి. శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కలిసొచ్చే పార్టీలతో పాటు మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ సమావేశంలో భాగస్వాములవుతారని తెలిపారు. కేంద్రం ఎన్నికల సంఘం రెండోదశ ఎస్ఐఆర్ ప్రకటించిన రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం లేదని అయినా అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. చట్ట ప్రకారం పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదన్నారు. గతంలో రాజకీయ పార్టీల సమావేశం జరిగిన సమయంలో ఎస్ఐఆర్ అనేది ఎజెండాలో కూడా లేదన్నారు. తాజాగా ఎన్నికల కమిషన్ కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి ఎస్ఐఆర్ అమలు చేయాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఇది ఎన్నికల ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని , అప్రజాస్వామికమని తెలిపారు. బీహార్లో ఎస్ఐఆర్ చేస్తున్న సమయంలో టిడిపి దాన్ని వ్యతిరేకించిందని, ఇప్పుడు అమలు చేయడానికి అంగీకరించిందని అన్నారు. దీనిపై వైసిపి కూడా మాట్లాడటం లేదన్నారు. అసలు ఆ పార్టీ వైఖరి ఏమిటో స్పస్టం చేయాలని కోరారు. ఎస్ఐఆర్ అంటే ఓటుహక్కుకు ప్రమాదమేనని పేర్కొన్నారు.

