ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానిక భవన నిర్మాణ కార్మికులకు అవకాశం కల్పించాలి–సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు
NTODAY NEWS: భువనగిరి
ప్రభుత్వం త్వరలో నిర్మించబోయే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకే అవకాశం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం భువనగిరి మండల 2వ మహాసభ దాసరి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా గోద శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న భువన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని అయన ఆరోపించారు పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ విడుదల చేయడం లేదని, ఆన్లైన్లో నమోదు కోసం కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించడంలో కార్మిక శాఖ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఆన్లైన్ అప్డేట్ పేరుతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు కార్మికులు రోజుల తరబడి లేబర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులో జమ కావాల్సిన సెస్సు సక్రమంగా వసూలు చేయకపోవడం వల్ల కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి ఏశాల అశోక్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు పాల్గొన్నారు.