చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం.

Spread the love

చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం.

16 మంది మృతి

నగరంలోని చార్మినార్‌ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్‌ హౌస్‌ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

మృతుల వివరాలు :

1)రాజేంద్రకుమార్‌ (67)
2 )అభిషేక్‌ మోదీ (30)
3) సుమిత్ర (65)
4) మున్నీబాయి (72)
5)ఆరుషి జైన్‌ (17)
6)శీతల్‌ జైన్‌ (37)
7)ఇరాజ్‌ (2)
8)హర్షాలీ గుప్తా (7)
9)రజని అగర్వాల్‌
10)అన్య మోదీ
11)పంకజ్‌ మోదీ
12)వర్ష మోదీ
13)ఇదిక్కి మోదీ
14) రిషభ్‌
15)ప్రథమ్‌ అగర్వాల్‌
16)ప్రాంశు అగర్వాల్‌

సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 16 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తదితరులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

అగ్నిమాపక సిబ్బందికి సరైన శిక్షణ అందించాలి: కిషన్‌రెడ్డి

గుల్జార్‌హౌస్‌ వద్ద ఘటనాస్థలాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని తెలిపారు. చిన్న ప్రమాదమే అయినా.. ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉందని చెప్పారు. అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరఫున సాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »