వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు, రైతులకు అవగాహన కార్యక్రమం
NTODAY NEWS: తూర్పు గోదావరి జిల్లా
ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, యూరియా వాడకం తగ్గి, శాస్త్రీయ పద్దతిలో ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన పెరగాలని జిల్లా సహకార అధికారి M వెంకటరమణ సూచించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా శ్రీ వేణు గోపాల ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, యర్నగూడెం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో యర్నగూడెంలో సంఘ సభ్యులు, రైతులకు అవగాహన కార్యక్రమం సంఘ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వెంకటరమణ పాల్గొని ప్రసంగించారు. ఎరువులు అధికంగా వినియోగించినట్లయితే పంటలకు నష్టమవుతుందని, మట్టిలో పోషకాల సమతుల్యత నాశనం కావచ్చని హెచ్చరించారు. సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. దీంతో నేల జీవశక్తి పెరిగి, రసాయన ఎరువులపై ఆధారపడే అవసరం తగ్గుతుందన్నారు. జీవామృతం, పంచగవ్య, కంపోస్ట్, వెర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను యాంత్రిక ఎరువులతో కలిపి వాడితే, నేల ఫలదాయకత మరింత మెరుగవుతుందని తెలిపారు. పంట కాలంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి, తగిన సలహాలు పొందితే నష్టాలను నివారించుకోవచ్చని వెంకటరమణ సూచించారు. మండల వ్యవసాయ అధికారి K కమల్ రాజు మాట్లాడుతూ రైతు ఏ దశలో ఏ రకం ఎరువు ఎంత మోతాదులో వాడాలో గ్రహించి ఎరువు వాడాలని అన్నారు. ఎక్కువ ఎరువు వినియోగం వల్ల దిగుబడి పెరగదని నేల కలుషితం అవుతుందని అన్నారు. ఎప్పుడైనా పంటకు అవసరమైన సూటి ఎరువులు వాడాలని తెలిపారు. మొదటి దశలో మాత్రమే కాంప్లెక్స్ ఎరువులు వాడాలని, రెండు మూడు దశల్లో కాంప్లెక్స్ ఎరువులు వాడటం నిరర్ధకం అని పేర్కొన్నారు. ఎక్కువ ఎరువు వాడకం వల్ల పంట కాలం పెరుగుతుందని చెప్పారు. మోతాదు మించిన ఎరువు నేలను పాడు చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్కు ముందుగా మట్టి పరీక్షలు చేయించుకుని, దాని నివేదిక ఆధారంగా ఎరువుల మోతాదులను నిర్ణయించుకోవాలని తెలిపారు. వ్యవసాయ అధికారుల సలహాతో సరైన దశలో సరైన మోతాదులో మాత్రమే ఎరువులు వేయాలని చెప్పారు. సాగు ప్రారంభానికి ముందే మట్టిలో పోషకాల లభ్యతను తెలుసుకోవడం చాలా ముఖ్యమని కమల్ రాజు చెప్పారు. ఎరువు బురద పాళ్లలో వాడాలని, మనం వాడే ఎరువుల్లో 65 శాతం ఎరువులు వృధా అవుతున్నాయని చెప్పారు. మట్టిలో ఉండే పోషకాలను బట్టి నైట్రోజన్ (N), ఫాస్పరస్ (P), పొటాష్ (K) మరియు సూక్ష్మ పోషకాలు అవసరమైతే మాత్రమేనే వేసుకోవాలలని వ్యవసాయ అధికారి అన్నారు. గ్రామ నాయకులు సుబ్బరాజు మాట్లాడుతూ నానో ఎరువులు వాడకం పెరగాలని చెప్పారు, రైతు వ్యవసాయం చేయడం లేదని, ఒక ఎకరం మాములు ఎరువులు, ఒక ఎకరం నానో ఎరువులు వాడి పరిశీలించాలని అన్నారు. సీనియర్ రైతు నాయకులు గద్దె విజయ్ గారు మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువు వాడాలని, డ్రోన్ టెక్నాలజీ లో నానో ఎరువు వాడకం చేయాలని అన్నారు. భూసారం అభివృద్ధి కి మన ఎరువులు వాడకం దోహదం చేయాలని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న రైతులు మరియు సంఘ సభ్యులు తమ అనుభవాలను పక్కటి రైతులకు పంచుతూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. అవగాహనా కార్యక్రమంలో PIC ఉషారాణి, K సుబ్బారావు, CEO M పెదబాబు, యర్నగూడెం రైతులు తదితరులు పాల్గొన్నారు.













