కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం
కొండపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో హైస్కూలు వద్ద నుంచి ఎర్ర బ్రిడ్జి హైవే వరకు రూ.43.45 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండపల్లి మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎప్పటినుంచో ఈ రహదారి సమస్య అలానే ఉందన్నారు. ప్రజలు ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారని, ఈ రోడ్డు నిర్మాణంతో అన్ని అవస్థలు తొలగిపోతాయన్నారు. సాధ్యమైనంత త్వరగా రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ నూతన పాలకవర్గం కూడా కొండపల్లి పట్టణ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి, నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాస్, జంపాల సీతారామయ్య, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

