భూభారతి చట్టం ద్వారానే రైతుల భూ సమస్యలు పరిష్కారం–మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
NTODAY NEWS: సంస్థాన్ నారాయణపురం మండలం, ఏప్రిల్ 28
అవినీతి లేకుండా రైతుల భూములు , భూ హక్కులు భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలుచేస్తాయి.ఇక పై భూ సమస్యలు లేకుండా భూభారతి (ఆర్ ఓ ఆర్ చట్టం) పోర్టల్ ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కాగా అప్పజెప్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.సోమవారం రోజున సంస్థాన్ నారాయణపురం కేంద్రాలలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి మనిషికి ఆధార్ మాదిరిగానే ప్రతి ఒక్కరి రానున్న రోజుల్లో ప్రభుత్వం భూమికి భూధార్ కార్డులు అందిస్తుందన్నారు.భూ సమస్యల పరిష్కారానికి అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు పెట్టి భూభారతి చట్టం ద్వారా సులభతరంగా భూ సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారని అన్నారు.
ప్రభుత్వం ప్రజా పాలన , ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ అందుకనుగుణంగా రైతుల సూచనలు, సలహాలతో ఏ ఒక్క రైతు కూడా నష్టపోవద్దని ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి రైతుకు వ్యవసాయ భూములను కొలిచి, హద్దులు గీసి రైతు సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడతామన్నారు.
రెవెన్యూ శాఖ సిబ్బంది గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఒక బాధ్యతగా తీసుకొని ఏ తప్పు చేయకుండా రైతులకు భూభారతి చట్టం ద్వారా మేలు చేయాలన్నారు. గ్రామాలలో రెవెన్యూ సిబ్బంది వస్తే స్వాగతించాలని, రైతులకు సూచించారు.అలాగే అధికారులు కూడా రైతులను గౌరవిస్తూ రెవెన్యూ శాఖ సిబ్బంది పని చేయాలన్నారు.
భూమి ఉన్న ప్రతి రైతుకు భూమి హక్కుల కష్టాలను తీర్చేలా ప్రభుత్వం కొత్త భూ హక్కుల చట్టం (భూ భారతి ఆర్ ఓ ఆర్ చట్టం) తీసుకొచ్చిందని, ఇక పై భూ సమస్య ఉండవని అన్నారు.
ప్రభుత్వం నిరుపేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా అందించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి రెండు అప్పీల్ వ్యవస్థ చేపట్టి ఆర్డీఓ పరిధిలో కాకపోతే కలెక్టర్ స్థాయిలో అప్పీల్ చేసుకోవచ్చునని అన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ… భూ భారతి చట్టం ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా ప్రభుత్వం రూపొందించింది అన్నారు.(ఆర్ ఓ ఆర్ చట్టం )పై ప్రతి రైతు అవగాహన కలిగి తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
పేద ప్రజల భూ సమస్యలు ధరణిలో అప్పీల్ వ్యవస్థ లేనందున నేరుగా కోర్ట్ కు మాత్రమే వెళ్ళవలసి వచ్చేదన్నారు.
ఇప్పుడు భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థ ఉండడం ద్వారా ఆర్డీవో కు అప్పీల్ చేసుకోవచ్చని, ఆర్డీఓ స్థాయిలో కూడా కాకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు.
భూ సమస్య ఉన్న ప్రతి పేద కుటుంబానికి రానున్న రోజుల్లో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్య దరఖాస్తులు స్వీకరించి సులభతరంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు .
పేద ప్రజలు కోర్టుని ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు,ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశ్యం తో ఉచితంగా ప్రభుత్వమే మీ తరుపున ఒక న్యాయవాదిని పెట్టి కోర్టులో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు.దీనికి ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి అభినందనలు తెలపాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇకపై భూముల సర్వే నెంబర్లు నమోదు చేయడమే కాకుండా, సర్వేయర్ తో హద్దులు ఏర్పాటు చేయించి మ్యాపులతో సహా భూ రికార్డులలో నమోదు చేస్తూ, కంప్యూటరీకరణ చేస్తామని,
భూ భద్రత కై ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో సంబంధిత భూ రికార్డులను భద్రపరుస్తామన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరించి భూ సమస్య లేని జిల్లాగా జిల్లా యంత్రాంగం పట్టుధలతో పని చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో డిసీసీబీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, సంబందిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.