విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరిన ఉత్సవ్ కమిటీ సభ్యులు
NTODAY NEWS: విజయవాడ
విజయవాడ ఉత్సవ్ విజయవంతానికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరిన ఉత్సవ్ కమిటీ సభ్యులు
శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయకుడిని దర్శించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్, ముత్తవరపు మురళీ కృష్ణ
విజయవాడ నగరంలోని కెనాల్ రోడ్లో గల శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం విజయవాడ ఉత్సవ్ కమిటీ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ముత్తవరపు మురళీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ సన్నిధిలో ఎంపీ కేశినేని శివనాథ్, మురళీ కృష్ణ వినాయక స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికను స్వామివారి కి సమర్పించారు. అనంతరం వీరికి వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవ్ రాష్ట్రానికి గర్వకారణం కానున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుక. ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరగాలని విఘ్నేశ్వరుని ప్రార్థించాను. ప్రజలందరి భాగస్వామ్యం, ఆశీర్వాదాలతో ఇప్పటికే నగరంలో పండుగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. అలాగే యువత నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ మహోత్సవంలో పాల్గొని విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. విజయవాడ ఉత్సవ్ ద్వారా స్థానిక కళాకారులకు, సాంస్కృతిక ప్రతిభలకు వేదిక లభిస్తుందని, నగర పర్యాటకానికి మరింత గుర్తింపు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.













