ఉచిత డే కేర్ సెంటర్ ప్రారంభం
NTODAY NEWS: సైదాబాద్
సేఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, హ్యూమన్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో సింగరేణి కాలనీలో ఉచితంగా “ఉడాన్ డే కేర్ సెంటర్” ప్రారంభమైంది. ఈ సెంటర్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన సూరేపల్లి వరలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత గారు మాట్లాడుతూ— “డే కేర్ సెంటర్ స్థాపన వెనుక ప్రధాన ఉద్దేశ్యం ప్రతి తల్లి ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి అవకాశం కల్పించడం. ఇక్కడ పిల్లలను చూసుకోవడానికి ముగ్గురు టీచర్లు, ఒక ఆయా నియమించబడ్డారు. 6 నెలల నుండి 6 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలను ఈ సెంటర్లో చేర్చుకోవచ్చు. విద్య, ఆరోగ్యం, భద్రతతో పాటు పిల్లల అభివృద్ధి మా బాధ్యత” అని తెలిపారు.
పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ— “ఇంతకు ముందు మేము ఉద్యోగాలకు వెళ్లలేకపోయాం. పిల్లలను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండేవాళ్లం. ఇప్పుడు ఈ డే కేర్ సెంటర్ ప్రారంభం కావడంతో మా పిల్లలను ఇక్కడ ఉంచి, ఉద్యోగాలకు వెళ్లగలుగుతున్నాం. మా కుటుంబానికి ఇది గొప్ప సహాయంగా మారింది. సుజాత మేడమ్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు” అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ ఆనంద్ రావు, చిన్నపాక చంద్రహాస్, పావని, శ్రీను, వల్లి సాహెబ్, డే కేర్ సెంటర్ టీచర్లు సునీత, అంజలి, రెహానా, అఫ్సర, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.













