గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి– రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు
NTODAY NEWS: సిపి కార్యాలయం
త్వరలో ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు శనివారం రోజున అధికారులతో సిపి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి సూచనలు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,రాష్ట్రంలో జరుపుకొనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన వినాయక చవితి వేడుకలు ప్రణాళిక ప్రకారం జరగాలని,ఎక్కడా అవాంఛిత సంఘటనలకు తావులేకుండా ప్రశాంతమైన వాతవరణంలో నిమజ్జనం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో,అధికారులు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు.గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని,ఆయా ప్రాంతాల్లోని పౌరవిభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.రానున్న గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్ల నిర్వహణ,భద్రతకు సంబంధించిన రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ,అగ్నిమాపక శాఖ,నీటి పారుదల శాఖ, వైద్యశాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా సజావుగా జరుపుకునేలా చూడాలన్నారు.నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సీపీ సూచించారు.ఇన్ స్పెక్టర్లు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలన్నారు.డయల్ 100 కాల్స్ కు సత్వరమే స్పందించాలని, సీసీటీవీలను విస్తృతంగా వినియోగించాలని, విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మండపాల్లో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని మండపం నిర్వహకులు, కమిటీలకు అధికారులు వివరించి చెప్పాలని సూచించారు. భక్తుల సందర్శనను దృష్టిలో వుంచుకుని మండపాలలో క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల్లో షార్ట్ సర్క్యూట్ జరగకుండా చోరవ తీసుకొవాలని, కరెంట్ షాక్ కొట్టకుండా మండపాల వద్ద ప్లాస్టిక్ పరదాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న గణేష్ మండపం నిర్వాహకుల కమిటీ వివరాలు తీసుకోవాలని,విద్యుత్ ప్రమాదాలు జరగకుండా,సరఫరాలో అంతరాయం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొవాలని ఆదేశించారు.రౌడీ షీటర్,సంఘ విద్రోహశక్తులమిద మీద నిఘా ఉంచాలని సూచించారు.వినాయక మండపాల దగ్గర ఎటువంటి సమస్యలు,ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు వుంటే బందోబస్తును పెంచాలని సూచించారు.అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలందరూ గణేశ్ ఉత్సవాలను ఘనంగా,శాంతియుతంగా జరుపుకోవాలని, గణేష్ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పోలీసులతో పటిష్టమైన బందోబస్తు, నిమజ్జనోత్సవానికి అవసరమైన పోలీస్ బందోబస్తు, స్విమ్మర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
అదేవిధంగా రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పరిస్థితిని పర్యవేక్షించాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు.నిమజ్జనం సందర్భంగా జిహెచ్ఎంసి అధికారుల సమన్వయంతో ముందుగానే చెరువులు,ఇతర నిమజ్జన నీటి కుంటల వద్ద వీధి దీపాలు,ఫ్లడ్ లైట్లు, అవసరమున్న మేర క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం గణేశ్ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద టెంట్లు,విద్యుత్ లైట్లను, బారికేడ్లను నిర్మించాలని,మంచి నీటి సౌకర్యం,మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు,వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు.24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలన్నారు.ప్రజలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతు పనులు, శానిటైజేషన్ పనులను చేపట్టాలన్నారు.గణేష్ వేడుకలను నిర్విఘ్నంగా,ఘనంగా గౌరవప్రదంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. భద్రతాపరంగా పోలీసులు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారన్నారు.ఈ సమావేశంలో డీసీపీ ఎస్బి జి నరసింహ రెడ్డి, డిసిపి క్రైమ్స్ అరవింద్ బాబు,డీసీపీ అడ్మిన్ ఇందిరా, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ఎస్బి, సీసీఆర్బి ఏసిపిలు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.













