కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Spread the love

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా!

NTODAY NEWS: ఆంధ్రప్రదేశ్‌ ( ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)

ఏపీలో కొత్త జిల్లాల కోసం ఉపసంఘం ఏర్పాటు – రాజధాని పరిధిలో కొత్త జిల్లాకు అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం పక్కన పెట్టి గత ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినప్పటి నుంచి అనేక వివాదాలు, అసంతృప్తులు వెల్లువెత్తాయి. ప్రజల అభిప్రాయాలను సక్రమంగా సేకరించకుండానే తీసుకున్న ఆ నిర్ణయం గందరగోళానికి దారి తీసిందని విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితిని సరిచేయడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది.ఉపసంఘం ఏర్పాటు: జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ప్రజల వినతులు స్వీకరించడం ప్రారంభించింది. జిల్లాల కలెక్టర్లు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. అందిన ప్రతిపాదనలన్నింటినీ సమీక్షించిన తర్వాత ఉపసంఘం అసెంబ్లీ సమావేశాలకు ముందే తన నివేదికను సమర్పించనుంది. గడువు తేది స్పష్టంగా: జనగణన షెడ్యూల్ కారణంగా 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు లేదా పేర్ల మార్పులు చేయడం సాధ్యం కాదు. అందువల్ల అన్ని మార్పులు 2025 డిసెంబరు 31లోగా పూర్తి చేసి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ప్రతిపాదిత జిల్లాలు: మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా: ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం పరిశీలనలో ఉంది. అదనంగా బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపితే పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని భావిస్తున్నారు. ఇలా చేస్తే రెండు జిల్లాలు సమతూకంగా నిలుస్తాయి.అమరావతి కేంద్రంగా అర్బన్ జిల్లా: రాజధాని అమరావతిని కేంద్రీకరించి ప్రత్యేక అర్బన్ జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా చర్చనీయాంశమైంది. అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో పాటు మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలను కలిపి ఐదు నియోజకవర్గాల జిల్లాగా తీర్చిదిద్దే అవకాశముంది. గుంటూరు జిల్లాలో మిగిలే గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలు మరో జిల్లాగా కొనసాగుతాయి.రంపచోడవరం కేంద్రంగా జిల్లా: ఏజెన్సీ ప్రాంత ప్రజల పరిపాలనా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ముందుకొచ్చింది. ప్రస్తుతం అక్కడి ప్రజలు పాడేరు జిల్లా కేంద్రానికి 180 కి.మీ. పైగా ప్రయాణించాల్సి వస్తోంది. కలెక్టర్ కూడా గ్రీవెన్స్ కార్యక్రమాలను రెండు చోట్ల నిర్వహించాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి రంపచోడవరం, చింతూరు డివిజన్లతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు ఆలోచనలో ఉంది.పునర్వ్యవస్థీకరణలో మార్పులు: కొన్ని నియోజకవర్గాల పునర్విభజనపై కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని యోచిస్తున్నారు. దీని వల్ల ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య, తిరువూరు, మైలవరం, గన్నవరం, పెనమలూరు సహా ఏడు నియోజకవర్గాలు ఉంటాయి.అదే విధంగా శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో, మండపేటను తూర్పుగోదావరిలో, రామచంద్రపురంను కాకినాడ జిల్లాలో చేర్చే అవకాశం ఉంది. కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయి.జిల్లాల పునర్వ్యవస్థీకరణ సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదు. ఇది ప్రజల జీవితాలపై, అభివృద్ధి అవకాశాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. డిసెంబరు 31 గడువు సమీపిస్తున్న తరుణంలో కొత్త జిల్లాల తుది మార్పులపై ఆసక్తి నెలకొంది.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »