ఆ ముసాయిదా రద్దుచేయాలి

Spread the love

ఆ ముసాయిదా రద్దుచేయాలి
-ముప్పాళ్ళ భార్గవశ్రీ సీపీఐఎంఎల్ నాయకులు

NTODAY NEWS: ప్రత్యేక కథనం

పరిశ్రమలు స్థాపించబోయే ముందు కాలుష్య నియంత్రణ బోర్డులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా తమ ప్రాంతంలో పెట్టే పరిశ్రమ వల్ల పర్యావరణంతో పాటు తమ ఆరోగ్యాలను ఏ విధంగా నష్టపోతామో వివరంగా చెప్పుకునే అవకాశం ప్రజలకు లభిస్తుంది. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలా వద్దా అనే సూచనలను ఆయా ప్రభుత్వాలకు అవి పంపుతాయి.

ఇటీవల విశాఖ జిల్లా పెదగంట్యాడలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న అధికారులపై ఆ ప్రాంత ప్రజలు తమ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడే కాదు బల్క్ డ్రగ్ ప్లాంట్ పెట్టే విశాఖ జిల్లా నక్కపల్లి ప్రాంతంలో, హైడ్రో పవర్ ప్రాజెక్టులు పెట్టే అల్లూరు జిల్లా ప్రాంతంలో, సోలార్ విద్యుత్ పరికరాల ప్రాజెక్టు కోసం కరేడు ప్రాంతంలో, ఇంకా రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల ప్రజలు తమ తీవ్ర నిరసన తెలిపిన ఫలితంగా ఆయా ఫ్యాక్టరీలు, పరిశ్రమల ఏర్పాటు తాత్కాలికంగా ఆగిపోయింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వాలు తలపెట్టిన ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రారంభమవుతాయి. ఇది ప్రజల పాలిట అశనిపాతం లాంటి చర్య. అక్టోబర్ 1న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విధానపరమైన ఓ ప్రధాన మార్పును ప్రకటించింది. వాతావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ 2006కు సవరణ చేస్తూ ప్రకటించిన నోటిఫికేషన్ అది.

సొంత క్యాప్టివ్ ప్లాంట్లు (ఉదాహరణకు ఇలాంటి నిర్మాణానికి కావలసిన విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్లు లేకపోవడం, 90శాతం పైగా రైల్వే ట్రాన్స్‌పోర్ట్‌పై ఆధారపడేవి) లేని సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లకు ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలిపింది. ఈ సవరణకు సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.

ముంబయిలోని కల్యాణ్ ప్రాంతంలో అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ప్రారంభించాలన్న ప్రయత్నాలపై ఆ ప్రాంత ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం.. గతంలో మాదిరిగా ప్రజాభిప్రాయ సేకరణ, ప్రభావ నివేదికల సమర్పణ వంటివేవీ అవసరం లేదు. ప్లాంటుపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపడానికి 60రోజుల సమయం మాత్రం ఇచ్చారు. ఇది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే.

అదానీ గ్రూప్‌నకు అనుబంధ సంస్థ అయిన అంబుజా సిమెంట్స్ రూ.1,400 కోట్ల పెట్టుబడితో ఆరు సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లను కలాణ్‌లో నెలకొల్పాలని యోచిస్తోంది. ఈ యూనిట్ల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్ వంటి కాలుష్య ఉద్గారాల ప్రభావంతో తమ ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటాయని కల్యాణ్‌ ప్రాంతంలోని ప్రజలు వ్యధ చెందుతున్నారు. సమీపంలోని పదికి పైగా గ్రామాల ప్రజలు కూడా ఈ ఫ్యాక్టరీల ఏర్పాటుకు వ్యతిరేకంగా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. సంతకాల సేకరణ కూడా జరుపుతున్నారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా నోటిఫికేషన్‌తో అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు ఇక అడ్డూ అదుపు ఉండదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ముసాయిదా నోటిఫికేషన్ ప్రజల జీవితాలకు ఉరితాడు కాబోతోందని గుర్తించాలి. ఈ నోటిఫికేషన్‌ బేషరతు రద్దు కోసం వివిధ రకాల పరిశ్రమలు నిర్మించే ప్రాంతాల ప్రజలతో పాటు వివిధ రంగాల ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులు, వామపక్ష శక్తులు సంఘటిత ఉద్యమాన్ని నిర్మించాలి.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »