మత్స్య శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రి
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
చేప పిల్లలు చెరువులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వర్యులు వాకాటి శ్రీహరి సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి సోమవారం హైదరాబాద్ నుంచి మత్స్య శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.చేపల పంపిణీ టెండర్ల ఫైనల్ చేయడం,చేపల పంపిణీ పర్యవేక్షణ ఇతర శాఖల అధికారుల నియామకం,యాక్షన్ ప్లాన్ తయారీ తదితర అంశాల పై రివ్యూ నిర్వహించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వర్యులు వాకాటి శ్రీహరి మాట్లాడుతూ 122 కోట్ల 22 లక్షల ఖర్చు చేసి 83 కోట్ల చేప పిల్లలను,10 కోట్ల రొయ్య పిల్లలను 26 వేల 357 నీటి వనరులలో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు.చేపలు పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ఆలస్యమైందని, నవంబర్ 20 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు నీటి వనరులలో చేప,రొయ్య పిల్లల విడుదల పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. చేపల పంపిణీ కార్యక్రమం అమలులో చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి నీటి వనరుల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేయాలని,ప్రస్తుత సమయంలో నీటి వనరులలో చేపలు విడుదల చేస్తేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. టీ-మత్స్య యాప్ లో చేప పిల్లల వివరాలు సరఫరాదారుల వివరాలు రవాణా చేసే వాహనం సంపూర్ణ వివరాలను మత్స్య శాఖ అధికారి పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు.చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి నీటి వనరుల దగ్గర ఎన్ని చేప పిల్లలు విడుదల చేస్తున్నామో వివరాలు తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు.చేప పిల్లల కార్యక్రమం ఆలస్యం అవుతున్న కొద్దీ మత్స్యకారులు ఇబ్బందులకు గురవుతారని,ఆ అంశాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. రాబోయే 18 రోజుల పాటు చాలా కీలకంగా ఉంటుందని అన్నారు.గతంలో ఉన్న అభియోగాలను పూర్తిగా తొలగించేలా పారదర్శకంగా ఈ కార్యక్రమం జిల్లాలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.చేపల పంపిణీ కార్యక్రమానికి రాజకీయాలకతీతంగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని అన్నారు.చేపల విడుదల సమాచారం సంబంధిత మత్స్యకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు అందించాలని, చేపల ఉత్పత్తి పెంచడంతో పాటు వాటి విక్రయానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని,ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలాలలో చేపల స్టాల్స్, ఫిష్ మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లామత్య శాఖ అధికారి రాజారాం సంబంధిత అధికారులు పాల్గొన్నారు

