త్వరలోనే ధర్మారెడ్డి కాలువ ద్వారా నీటిని అందిస్తాం: ఎమ్మెల్యే వేముల వీరేశం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..
NTODAY NEWS: చిట్యాల
ధర్మారెడ్డి పల్లి కాల్వ పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి త్వరలోనే రైతులకు సాగునీటిని అందిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం చిట్యాల మండలంలో ని వట్టిమర్తి, సుర్కంటి గూడెం గ్రామాల్లో జరిగిన పనుల జాతర పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో పలు మండలాలలో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్యతో పాటు పారిశుద్ధ్య విద్య మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా పనుల జాతర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నూతనoగా నిర్మిస్తున్న పంచాయతీ భవన నిర్మాణానికి మరియు సుర్కంటి గూడెం నుండి 65 వ జాతీయ రహదారి వరకు 84 లక్షల వ్యయంతో కూడిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వట్టిమర్తి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామన్నారు. చిట్యాల మండల రైతాంగానికి సాగునీరు అందించే ధర్మారెడ్డి కాల్వను త్వరలోనే పూర్తి చేసి రైతులకు నీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కాల్వ పెండింగ్ పనులను స్వయంగా పరిశీలించానని త్వరలోనే కాలువ ద్వారా నీటిని అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, సన్నబియ్యం ప్రజలకు పంపిణీ చేస్తున్నామని, 1955 భారత మొదటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్ డ్యాం నేటి వరకు దెబ్బ తినలేదని బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాల్లేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలో నే కూలిపోయిందని గత ప్రభుత్వం 8లక్షల కోట్లు అప్పులు చేశారని, నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..













