www.ntodaynews.com
గ్రామాల్లో పులి సంచారంపై ప్రత్యేక చర్యలు
తెలంగాణ
గ్రామాల్లో పులి సంచారం: జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు.
మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో పులి దాడిలో లేగ దూడ మృతి చెందిన సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులతో సమావేశమై పులిని పట్టుకునేందుకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు.
పులి పట్టుకునేందుకు చర్యలు
పులి సంచారాన్ని గుర్తించేందుకు థర్మల్ డ్రోన్ ద్వారా వీడియో రికార్డింగ్, ట్రాప్ కెమెరాల ఏర్పాటు, పులిని బంధించేందుకు బోన్లను అమర్చినట్లు అటవీ శాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు. పులి అడుగుజాడలను నిరంతరం గమనిస్తూ దానిని అడవిలోకి మళ్లించే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
ప్రజలకు సూచనలు
అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల కోసం వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని కలెక్టర్ సూచించారు. రాత్రివేళ పశువులను బయట వదలకుండా పశువుల పాకల్లో సరిపడా వెలుతురు ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
పులి కనిపించినట్లు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దానికి సమీపానికి వెళ్లే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి, రెవెన్యూ అధికారులు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube