చిట్యాలలో మొబైల్ దొంగలను పట్టుకున్న స్థానికులు
చిట్యాలలో మొబైల్ దొంగలను పట్టుకున్న స్థానికులు
నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా వరుస మొబైల్ దొంగతనాలతో హడలెత్తిస్తున్న ముఠా ఎట్టకేలకు చిక్కింది. స్థానికుల అప్రమత్తతతో ఇద్దరు దొంగలు స్థానికులకు పట్టుబడగా, మరొకరు పరారైనట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా చిట్యాల మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు మొబైల్ ఫోన్లను యధేచ్ఛగా దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల మార్చి 30వ తేదీన బాధితులు చిట్యాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే, సదరు ముఠా మరోమారు చోరీలకు తెగబడింది. మరోసారి చిట్యాలలో ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కుతున్న క్రమంలో దొంగతనానికి పాల్పడుతుండగా అనుమానం వచ్చిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి ముఠా సభ్యులను పట్టుకున్నారు. వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నిందితులను అప్పగించారు. ప్రస్తుతం అదుపులో ఉన్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. వీరు కేవలం చిట్యాల మండలంలోనే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా దొంగతనాలకు పాల్పడ్డారా? ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు జరుపుతున్నట్టు ప్రాథమిక సమాచారం..