హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం
తెలంగాణలో కళలను ప్రోత్సహిస్తున్నాం: సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్,: ఎన్ టుడే న్యూస్.
హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో రవీంద్రభారతి మెయిన్ హాల్లో నిర్వహించిన కల్చరల్ ఫెస్టివల్–2026 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతులకు, కళలకు వేదికగా నిలుస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, కళాకారులను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల్లో చైతన్యం కలిగించే కళారూపాలను విస్తృతంగా ప్రదర్శించేందుకు త్వరలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, అందులో హైదరాబాద్ జిందాబాద్ వంటి పౌర సంస్థలను కూడా భాగస్వాములను చేస్తామని చెప్పారు.
ప్రజలకు సేవలందించడంలో హైదరాబాద్ జిందాబాద్ సంస్థ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. ఉచిత వైద్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సంస్థ అందిస్తున్న సేవలను ప్రశంసించారు.
16 కళారూపాలు.. 170 మంది కళాకారులు
కల్చరల్ ఫెస్టివల్లో సుమారు 16 రకాల కళారూపాలను 170 మంది కళాకారులు ప్రదర్శించారు. భగత్సింగ్ జీవితాన్ని ప్రతిబింబించే ‘ది ట్రైల్ ఆఫ్ భగత్ సింగ్’ నాటకంతో పాటు ప్రగతి నగర్ విద్యార్థులు ప్రదర్శించిన ‘సే నో టు డ్రగ్స్’, ‘ఆర్గాన్ డొనేషన్’ స్కిట్లు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి.
ఓం డాన్స్ అకాడమీ, అంబేద్కర్ కాలేజీ కళాబృందాల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కురుగంటి కళాక్షేత్రం ఆధ్వర్యంలో సాంప్రదాయ భరతనాట్యం ప్రదర్శించారు. ప్రముఖ కళాకారులు గురు స్వామి పేరడి, రవుఫుద్దీన్ స్టాండ్అప్ కామెడీ, శివ ప్రసాద్ మిమిక్రీ, రామడుగు వసంత్ మైమ్ షో, మౌనిక పపెట్ షో ప్రేక్షకుల మన్ననలు పొందాయి.
తానల్ మలయాళీ సేవాసమితి కళాకారులు ప్రదర్శించిన కేరళ సాంప్రదాయ తిరువాతిర నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విద్యార్థులకు బహుమతులు
హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో సుమారు 100 హైస్కూళ్లలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్, పాటల పోటీల్లో విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు.
వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజినల్ ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, పర్యావరణవేత్త డాక్టర్ జయసూర్య, హ్యాపీ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజశేఖర్, ప్రముఖ టీవీ నటి మలక్పేట శైలజ తదితరులు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కె. వీరయ్య, ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసరావు, పి. నాగేశ్వరరావు, మోహన్ నాయుడు, సంగీత, శ్రీవల్లి, మాధవి సుకుమార్, రాజమౌళి, నాగేష్, శంకర్ తదితరులు సమన్వయంతో నిర్వహించారు.