వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం
చిటఫండ్ ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తుల ఒత్తిడి తట్టుకోలేక ఉరివేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వడ్డీ వ్యాపారులు, చిటఫండ్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ( ఏఈఓ ) గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు బాలరాజు (38) ప్రస్తుతం కేతపల్లి మండలంలో ఏఈవోగా విధులను నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితం తన అవసరాల నిమిత్తం కొందరు ప్రైవేట్ వ్యక్తుల వద్ద బాలరాజు డబ్బులు అప్పుగా తీసుకున్నారు. అయితే, సదరు వ్యక్తులు అధిక వడ్డీలు లెక్కిస్తూ, బాలరాజును మోసగించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, అతని నుంచి ముందస్తుగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. గత కొంతకాలంగా వడ్డీ వ్యాపారులు, చిటఫండ్ ఏజెంట్లు డబ్బుల కోసం బాలరాజుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తూ మానసికంగా వేధించసాగారు. ఈ క్రమంలోనే బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక బాలరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని పేర్కొన్నారు . చివరకు తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతునికి భార్య పద్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని భార్య గుంటోజు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.