రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్
హైదరాబాద్ | NTODAY NEWS
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం (TRVS) రాష్ట్ర కమిటీ సమావేశంలో రజక వృత్తిదారుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ జమిస్తాన్పూర్ రిసాలగడ్డలోని రాష్ట్ర వృత్తిదారుల భవన్లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అన్నారపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ, జూలై 12 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా రజక వృత్తిదారుల సమస్యలపై ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో రజక వృత్తిదారులపై భూస్వాములు, పెత్తందారుల దాడులు, వేధింపులు పెరుగుతున్నాయని, మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచార ఘటనల్లో ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. నాగర్కర్నూలు జిల్లా కుమ్మెర, ఖమ్మం జిల్లా తల్లాడ, రంగారెడ్డి జిల్లా షాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలను ఉదాహరణగా ప్రస్తావించారు.
ఎన్నికల సందర్భంగా ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో రజక వృత్తిదారుల సంక్షేమానికి ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం, ప్రతి జిల్లాలో రూ.10 కోట్లతో ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణం, బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్ల నిధులు, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన రజక వృత్తిదారుల్లో చైతన్యం కల్పిస్తూ, బీసీ డిక్లరేషన్ అమలుకు సభలు, సమావేశాలు, సర్వేలు నిర్వహించి అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ తీర్మానించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శులు వడ్డెబోయిన వెంకటేష్, మరియాల గోపాల్, పాయిరాల రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు సి. వెంకటస్వామి, కె. యాదగిరి, యాదమ్మ, సీహెచ్. నాగేష్, మైలారం వెంకటేశ్వర్లు, ముదిగొండ రాంబాబు, జంగయ్య, పెద్దాపురం భాస్కర్, అవనగంటి స్వామి, బాతరాజు యాదగిరి, కానుగు శివ, నల్లగొండ జిల్లా నాయకులు ఐతరాజు యాదయ్య, రుద్రారపు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.