కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
చిత్తూరు జిల్లా | NTODAY NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన రాజకీయ పరిపాలన కోసం పోలీసు, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు.
పేదల పక్షాన నిలబడి పనిచేసే తెలుగుదేశం పార్టీ నాయకులను అధికారులు గౌరవించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పరిశీలించి, ఎక్కడైనా లోపాలు లేదా ఇబ్బందులు ఉంటే వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
అలాగే పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, "ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు (ఛారిటీ) చేద్దాం... పార్టీ ద్వారా రాజకీయాలు చేద్దాం" అని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు, రాజకీయ కార్యకలాపాలను వేర్వేరుగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.