డీజిల్లో 15% ఐసోబ్యుటనాల్ కలపడంపై కేంద్రం దృష్టి!
న్యూఢిల్లీ | NTODAY NEWS
దేశంలో చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు రవాణా రంగంలో కార్బన్ ఉద్గారాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా డీజిల్లో 15 శాతం ఐసోబ్యుటనాల్ (Isobutanol) కలపడంపై దృష్టి సారించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీజిల్లో ఇథనాల్ను నేరుగా కలపడం సాంకేతికంగా సాధ్యం కాదని, అందువల్ల ఇథనాల్ నుంచి ఐసోబ్యుటనాల్ తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఐసోబ్యుటనాల్ డీజిల్కు సమర్థవంతమైన ప్రత్యామ్నాయ ఇంధనంగా మారే అవకాశముందని పేర్కొన్నారు.
ఇంధన స్వయం సమృద్ధి సాధించడంలో ఈ చర్య కీలక అడుగుగా నిలుస్తుందని గడ్కరీ తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పైలట్ ప్రాజెక్టులు ప్రోత్సాహకర ఫలితాలను ఇచ్చాయని, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంతో దిగుమతి చమురుపై భారం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు.