నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
నల్గొండ, జూలై 4: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రేరణగా నిలిచిందన్నారు. నైజాం పాలన, రజాకారులు, దొరల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన మహనీయుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.
ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో వెట్టి చాకిరి, దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతూ అతి చిన్న వయసులోనే అమరుడైన దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిపెట్టే చారిత్రాత్మక మార్పులకు ఈ ఉద్యమం దోహదపడిందని వివరించారు.
దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ విద్యార్థి, యువజన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తాయని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు గుండాల నరేష్, మారుపాక కిరణ్, ఎండీ అదిల్, కార్లపూడి రాము, గోపి చందు, బాలరాజు, రోహిత్, ముకేశ్, సాయి, హరీష్, మాధవ్ యాదగిరి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.