విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా
మైనారిటీ యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి
విజయవాడలో భారీ 'మెగా జాబ్ మేళా' – రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా, మైనారిటీ సంక్షేమ శాఖ మరియు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న విజయవాడలోని ముసాఫిర్ ఖానా (పంజా సెంటర్)లో భారీ 'మెగా జాబ్ మేళా' నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు.
నంద్యాలలోని మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని మైనారిటీ యువత నిరుద్యోగులుగా ఉండకూడదనే ఉద్దేశంతో, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో మైనారిటీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో సుమారు 60 నుండి 70 ప్రముఖ కంపెనీలను ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నట్టు తెలిపారు. గత ఐదేళ్ల వైస్సార్సీపీ పాలనలో నిరుద్యోగ యువతకు ఎటువంటి ఉపాధి కల్పించని గత ప్రభుత్వం, నేడు అనవసర విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను యువత అందిపుచ్చుకోవాలని కోరారు. జులై 11న నిర్వహించనున్న ఈ మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో హాజరై, తమకు లభించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.