విద్యుత్ షాక్ తో రైతు మృతి
వ్యవసాయ బావి వద్ద పైపు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ రైతు మృతి చెందిన విషాద సంఘటన రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.ఎస్ఐ జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం కుంకుడుపాముల గ్రామానికి చెందిన గొలుసుల వెంకన్న (38) వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఎప్పటిలాగే శనివారం ఉదయం 6 గంటల సమయంలో వెంకన్న తన పొలానికి వెళ్లాడు. అక్కడ బోరు మోటారుకు ఊడిపోయిన పైపును అమర్చే క్రమంలో, ప్రమాదవశాత్తు మోటారుకు ఉన్న విద్యుత్ వైరు తగిలింది.
దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్కు గురైన వెంకన్న గట్టిగా అరుస్తూ కిందపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని మృతుడి భార్య గొలుసుల శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. యువ రైతు మృతితో కుంకుడుపాముల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.