సుదర్శన క్రియతో శరీరానికి, మనస్సుకు సంపూర్ణ ఆరోగ్యం
ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు
ప్రతిరోజూ సుదర్శన క్రియ చేయడం ద్వారా మన శరీరము, మనస్సు పూర్తిగా సర్వీసింగ్ చేసినట్లు అవుతుందని, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో యోగ, ధ్యానాన్ని భాగం చేసుకోవాలని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, టీచర్ పల్లపు బుద్ధుడు పిలుపునిచ్చారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని రైతు వేదిక నందు విద్యార్థులకు ప్రత్యేక యోగ, ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లపు బుద్ధుడు సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్, పద్మ సాధనాలు, త్రీ స్టేజ్ ప్రాణాయామ, సూర్య నమస్కారాలు, మరియు భస్త్రిక వంటి ప్రక్రియలను చేయించారు. ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ మానవుని జీవన విధానంలో ధ్యానం అనేది అతి ముఖ్యమైన ప్రక్రియ అన్నారు. నిత్యం ధ్యానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా శక్తివంతులై ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. పూజ్య గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ అందించిన సుదర్శన క్రియ మానవాళికి ఒక గొప్ప వరమని, ఇది ప్రతి విద్యార్థిలో ఎనలేని అంతర్గత శక్తిని పెంపొందిస్తుందని వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మనశ్శాంతి, సుదీర్ఘ విశ్రాంతి, సానుకూల శక్తి కోసం ధ్యానం చేస్తున్నారని గుర్తుచేశారు. శాంతియుత ప్రపంచ స్థాపన ధ్యానంతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం పది నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా కుటుంబాల్లో, గ్రామాల్లో ప్రశాంతత నెలకొని, అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ప్రసాద్, ట్రైనర్ బోయ స్వామి, నరేష్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.