సింగరేణి విశ్రాంత ఉద్యోగులను ఉద్యమకారులుగా గుర్తించాలి: ఎమ్మెల్సీ కోదండరామ్కు వినతి
మంచిర్యాల: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా తమ వేతనాలను సైతం నష్టపోయి 38 రోజులు సకల జనుల సమ్మె చేసిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులను కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్సీ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ సార్కు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ పైన ఫంక్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనను సంఘం నాయకులు కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు ఇవ్వాల్సిన 250 గజాల ఇంటి స్థలం, 50,000 రూపాయల పెన్షన్, గుర్తింపు కార్డులు, ఉచిత బస్ మరియు ట్రైన్ రవాణా సౌకర్యం, ఉచిత విద్య, కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం తదితర సౌకర్యాలను సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కూడా వర్తింపజేసి ఆదుకోవాలని కోరారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న కొంతమంది కార్మికులకు మాత్రమే ఆనాటి ప్రభుత్వం స్పెషల్ లీవ్లుగా పరిగణించి వేతనాలు చెల్లించిందని, వేలాది మంది కార్మికులు సమ్మె కాలంలో సిక్ లీవులు పెట్టుకోవడం వల్ల నష్టపోయారని తెలిపారు. కాబట్టి సిక్ లీవులు పెట్టుకున్న కార్మికులకు కూడా వాటిని స్పెషల్ లీవులుగా భావించి వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిపి న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షులు రాళ్ళబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ. గంగయ్య, నాయకులు ఎం. అంజయ్య, దేవులపల్లి రామస్వామి, మేడ రాజలింగు, రాజు, టీ. జనార్దన్ స్వామి తదితరులు పాల్గొన్నారు