కాళేశ్వరం పునరుద్ధరణ నిపుణుల పర్యవేక్షణలోనే.. ఎన్డీఎస్ఏ సూచనలే ప్రామాణికం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సిఫారసులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ సూచనలకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణం, డిజైన్, నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ నివేదిక తేల్చిందని, ప్రస్తుతం గేట్లు మూసి నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని పేర్కొంది కాబట్టే గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ చేపట్టడం లేదని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రస్తుత పరిస్థితిని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం 2026 జూన్ 30న ఏర్పాటు చేసిన టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ పర్యవేక్షణలోనే ప్రాజెక్టు డిజైన్, మరమ్మతులు, పునరుద్ధరణ జరగనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ఎన్డీఎస్ఏ, సెంట్రల్ వాటర్ కమిషన్, సీడబ్ల్యూఆర్పీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు జాతీయ, అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుంటారని వెల్లడించారు.
మేడిగడ్డ ఏడో బ్లాక్లో పిల్లర్లు 1.2 మీటర్లు కుంగిపోవడం, ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలే ప్రమాదానికి కారణమని ఎన్డీఎస్ఏ తన 365 పేజీల నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం ప్రాణాపాయమని, మరమ్మతులు పూర్తయ్యే వరకు గేట్లు మూయొద్దని ఎన్డీఎస్ఏ ఆదేశించిందన్నారు.
నీటిని ఎత్తిపోసే వ్యవస్థ పూర్తిగా బ్యారేజీల్లో నీటి నిల్వపై ఆధారపడి ఉంటుందని, గేట్లు మూసే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం నీటిని ఎత్తిపోసే అవకాశం లేదన్నారు. గేట్లు మూసి నీటిని నిల్వ చేస్తే బ్యారేజీలకే కాకుండా భద్రాచలం పరిసర ప్రాంతాలకు కూడా భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రాజెక్టు ప్రారంభమైన కొద్ది నెలల్లోనే లోపాలపై ఇంజినీర్లు హెచ్చరించినా వాటిని సరిదిద్దలేదని, అదే నిర్లక్ష్యం మేడిగడ్డ ప్రమాదానికి దారితీసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సాంకేతిక పరీక్షలు ఈ నెలలో పూర్తవుతాయని, అనంతరం ముంబయి ఐఐటీతో పాటు అంతర్జాతీయ నిపుణుల సూచనల మేరకు పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ప్రాజెక్టు పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదని, ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తూ నిపుణుల పర్యవేక్షణలోనే కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.