నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. 3,035 మంది టీచర్లపై బిహార్ ప్రభుత్వ చర్య
బిహార్లో నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందినట్లు గుర్తించిన 3,035 మంది టీచర్లను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నియామకాలపై జరిగిన విచారణలో పలు అక్రమాలు వెలుగులోకి రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
2006 నుంచి 2015 మధ్య స్థానిక సంస్థల ద్వారా జరిగిన ఉపాధ్యాయ నియామకాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టగా, కొందరు అభ్యర్థులు నకిలీ కుల ధ్రువపత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లు, వయస్సు, దివ్యాంగ ధ్రువపత్రాలు తదితర పత్రాలను ఉపయోగించి ఉద్యోగాలు పొందినట్లు గుర్తించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అర్హత లేని 3,035 మంది ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు బిహార్ విద్యాశాఖ వెల్లడించింది. అలాగే వారికి గతంలో చెల్లించిన జీతభత్యాల మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి వసూలు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
ఇకపై ప్రభుత్వ నియామకాలలో ఇలాంటి అక్రమాలు జరగకుండా ధ్రువపత్రాల పరిశీలనను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.