రామన్నపేట ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్దుల రమేష్పై పోలీసులు దాడి చేసిన ఘటనను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. చేనేత సహకార సంఘ ఎన్నికల బందోబస్తు పేరుతో రామన్నపేట పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ బిఆర్ఎస్ నాయకుడు బద్దుల రమేష్పై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తీవ్ర గాయాలతో రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ను పరామర్శించిన అనంతరం స్థానిక సీఐతో మాట్లాడి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, ముఖ్యంగా ఎస్సై సతీష్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీ కూలీల్లా వ్యవహరిస్తూ చట్టాన్ని అతిక్రమిస్తున్నారని ధ్వజమెత్తారు. నకిరేకల్ నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు స్థానిక ఎమ్మెల్యేకు ఊడిగం చేస్తూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని, పోస్టింగ్లను కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యే బంటుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం చేనేత సహకార సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించేందుకు వెళ్లిన బద్దుల రమేష్పై ఎలాంటి ప్రేరేపణ లేకుండానే దాడి చేయడం వెనుక ఎస్సై సతీష్ వ్యవహారశైలి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. విద్యార్థి నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా గత పదేళ్లుగా ప్రజలకు సేవలందించిన రమేష్పై ఎస్సై సతీష్ కావాలనే చేయి చేసుకున్నారని పేర్కొన్నారు. ఇటీవలే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేయడం అత్యంత అమానుషమని, ఇది రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలను తలపించే విధంగా ఉందని విమర్శించారు. నిన్న మొన్ననే పోస్టింగ్ తీసుకున్న ఎస్సై సతీష్ తన పోస్టింగ్ను కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులను, సోషల్ మీడియాలో పార్టీ పోస్టులు చేస్తున్న కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు పిలిపించి బెదిరింపులకు గురిచేస్తున్నారని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నాయకులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి అధికార దుర్వినియోగాన్ని బిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులకు కాలమే తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతో బిఆర్ఎస్ నాయకులను వేధిస్తున్న వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.
బద్దుల రమేష్పై దాడి చేసిన ఎస్సై సతీష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామని, బద్దుల రమేష్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.