మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం చెల్లించాలి: సీఐటీయు డిమాండ్
నస్పూర్ ప్రెస్ క్లబ్లో జిల్లా విస్తృత స్థాయి సమావేశం
ఏకగ్రీవంగా 20 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నిక
నస్పూర్ (మంచిర్యాల జిల్లా): మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని ప్రెస్ క్లబ్ నందు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా ఉపాధ్యక్షురాలు సరిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమాచారి, సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు కార్మికులకు రూ.10 వేల వేతనం ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పైసా పెంచలేదని మండిపడ్డారు. నిత్యవసరాలు, కూరగాయల ధరలు పెరుగుతున్నా విద్యార్థుల మెనూ చార్జీలు పెంచడం లేదని, మార్కెట్లో కోడిగుడ్డు ధర రూ.8 ఉంటే ప్రభుత్వం రూ.6 మాత్రమే ఇస్తూ కార్మికులపై ఆర్థిక భారం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అల్పాహార పథకానికి సంబంధించిన బకాయిలు ఒక్కో కార్మికురాలికి రూ.50 వేల నుండి లక్ష రూపాయల వరకు నిలిచిపోయాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు నిండాయనే నెపంతో కార్మికులను అకారణంగా తొలగించడం సరికాదని, వారికి రూ.2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్ ఇవ్వాలని కోరారు. అలాగే ప్రైవేటు సంస్థలకు ఈ పథకాన్ని అప్పగించే కుట్రలను ఆపాలని, ప్రతి విద్యార్థికి మెనూ చార్జీలు రూ.20 పెంచి, ఉచిత గ్యాస్, కోడిగుడ్లు, ఐడీ కార్డులు, యూనిఫామ్, వంట గదులు మరియు అవసరమైన గంజులను ప్రభుత్వమే సమకూర్చాలని, కార్మికులందరికీ రూ.20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, లేనిచో రాబోయే రోజుల్లో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశం అనంతరం 20 మందితో కూడిన మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా ఎండి కరీమా (చెన్నూరు), జిల్లా కార్యదర్శిగా ఎండి. రఫియా (హజిపూర్) ఎన్నికయ్యారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా గడ్డం లక్ష్మి (కన్నెపల్లి), మధునమ్మ (జైపూర్), రమాదేవి (బెల్లంపల్లి), జిల్లా కోశాధికారిగా సవిత (జైపూర్), జిల్లా సహాయ కార్యదర్శులుగా సరిత (భీమారం), మల్లక్క (తాండూరు), రబియా (లక్షటీపేట్) ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా బుచ్చమ్మ, సేపురి లక్ష్మి, లావణ్య, ఉమా, జ్యోతి, సుశీల, ఓదమ్మ, సుభద్రలతో పాటు కో-ఆప్షన్ సభ్యురాలిగా జ్యోతి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు