నారా బ్రాహ్మణికి 'ఫార్చ్యూన్ ఇండియా' గుర్తింపు
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి దేశంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ వ్యాపార పత్రిక ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 'మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్' జాబితాలో ఆమె పేరు నిలిచింది. దేశ ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్న మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరిగా ఈ గుర్తింపును అందుకున్నారు.
ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో నారా బ్రాహ్మణి ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానం, సంస్థ అభివృద్ధిలో రైతుల పాత్ర, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరచడమే హెరిటేజ్ ఫుడ్స్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ అరుదైన గుర్తింపును హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబ సభ్యులు, సంస్థ ఉద్యోగులు, పాల ఉత్పత్తిదారులు, రైతులందరికీ అంకితం చేస్తున్నట్లు నారా బ్రాహ్మణి తెలిపారు. సంస్థ అభివృద్ధిలో ప్రతి రైతు భాగస్వామ్యమే ఈ విజయానికి బలమని ఆమె చెప్పారు.
భార్య సాధించిన ఈ ఘనతపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతిభను కొనసాగిస్తూ, నాయకత్వ లక్షణాలతో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభినందనలు తెలిపారు.