అంతరిక్షంలోకి కమలం ఆకార వజ్రం.. చరిత్ర సృష్టించనున్న భారతీయ సంస్థ
భారతీయ జువెలరీ సంస్థ కాస్మోస్ డైమండ్స్ ల్యాబ్లో రూపొందించిన 'కాస్మిక్ బ్లూమ్' అనే కమలం ఆకార వజ్రాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఈ వజ్రాన్ని స్కైరూట్ ఎయిరోస్పేస్ సంస్థ చేపట్టనున్న విక్రమ్-1 మిషన్ ద్వారా ప్రయోగించనున్నారు.
ల్యాబ్లో తయారు చేసిన వజ్రాన్ని అంతరిక్షంలోకి పంపడం ప్రపంచంలోనే తొలిసారి అని కంపెనీ తెలిపింది. భారతీయతకు ప్రతీకగా నిలిచే వస్తువుపై నెలల తరబడి చర్చించిన అనంతరం, స్వచ్ఛత, జ్ఞానం, సృష్టికి ప్రతీకగా భావించే కమలం ఆకారాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
వజ్రం రూపకల్పన కోసం పురాతన భారతీయ దేవాలయాల శిల్పాలను అధ్యయనం చేసిన డిజైనర్లు, విష్ణువు, శివుడు, బ్రహ్మ, బుద్ధుడితో పాటు కమలం చిత్రాల నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. అంతరిక్ష ప్రయాణంలో ఎలాంటి నష్టం కలగకుండా ప్రత్యేక సాంకేతిక ప్రమాణాలతో వజ్రాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
స్కైరూట్ ఎయిరోస్పేస్ ప్రకారం, జులై 12 నుంచి ఆగస్టు 24 మధ్య రాకెట్ ప్రయోగానికి అనుకూల సమయం ఉంది. తుది ప్రయోగ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యం కలిగిన రాకెట్ను అభివృద్ధి చేసి ప్రయోగించిన తొలి భారతీయ ప్రైవేటు అంతరిక్ష సంస్థగా స్కైరూట్ గుర్తింపు పొందనుంది.