లంచాల ఆరోపణలు.. విధుల్లో నిర్లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై. వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాల అమలులో వైఫల్యం, రెవెన్యూ సేవల విషయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, లంచాల ఆరోపణలు, ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో అవకతవకల ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా పరిపాలనకు అందిన ఫిర్యాదులు, విచారణ నివేదికల ఆధారంగా తహసీల్దార్పై పలు తీవ్రమైన అభియోగాలు నమోదైనట్లు సమాచారం. ప్రజా విశ్వాసానికి భంగం కలిగేలా వ్యవహరించారని, ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను పాటించడంలో విఫలమయ్యారని అధికారులు పేర్కొన్నారు.
ప్రధాన అభియోగాల్లో ఒకటిగా దివంగత కోటయ్య కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రం జారీ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్లు తేలినట్లు సమాచారం. అలాగే రెవెన్యూ సేవల నిర్వహణలో పరిపాలనా లోపాలు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం, ప్రభుత్వ ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వంటి అంశాలు కూడా విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.