ఏపీలో రూర్బన్ పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త
అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల తరహా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'రూర్బన్' విధానాన్ని అమలు చేస్తోంది. 10 వేల మందికిపైగా జనాభా ఉన్న లేదా వార్షికంగా రూ.1 కోటికి పైగా ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ఎంపిక చేసింది.
ఈ నేపథ్యంలో రూర్బన్ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ హోదాకు అప్గ్రేడ్ చేసి, వాటికి అనుగుణంగా పే స్కేల్ను సవరించింది. అలాగే డిప్యూటీ ఎంపీడీవోలు, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పాలనాధికారులుగా గెజిటెడ్ హోదా కల్పించింది.
రాష్ట్రవ్యాప్తంగా 359 రూర్బన్ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం గుర్తించింది. ఈ నిర్ణయంతో పంచాయతీ పరిపాలన మరింత బలోపేతం కావడంతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు, మెరుగైన వేతన ప్రయోజనాలు లభించనున్నాయి.