దస్తావేజులు పెండింగ్లో ఉంచితే చెక్ స్లిప్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏదైనా దస్తావేజును పెండింగ్లో ఉంచితే తప్పనిసరిగా లిఖితపూర్వకంగా చెక్ స్లిప్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
చెక్ స్లిప్ ఇవ్వకుండా లేదా కార్డ్ 2.0 వ్యవస్థలో నమోదు చేయకుండా దస్తావేజులను అనధికారికంగా పెండింగ్లో ఉంచితే దానిని తీవ్రమైన సేవా లోపంగా పరిగణించి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సీఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ స్పష్టం చేశారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనేక దస్తావేజులు నెలల తరబడి పెండింగ్లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో పాత పెండింగ్ విధానాన్ని రద్దు చేసి, కాలపరిమితితో కూడిన కొత్త విధివిధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. వీటిని తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.