బహుభార్యత్వంపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం
గువాహటి, జూలై 11: బహుభార్యత్వాన్ని అరికట్టేందుకు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. అలాగే బహుభార్యత్వాన్ని పాటించే వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిపివేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు 2026–27 రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా ప్రతిపాదనలు వెల్లడించారు. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, సామాజిక సంస్కరణలను బలోపేతం చేయడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
అదేవిధంగా, ఏదైనా క్రిమినల్ చట్టం కింద నేరం రుజువై శిక్షపడిన వ్యక్తులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిరాకరించే ప్రతిపాదనను బడ్జెట్లో చేర్చారు.
కాగా, గతంలోనే బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ తాజా నిర్ణయాలతో బహుభార్యత్వంపై మరింత కఠిన వైఖరిని అస్సాం ప్రభుత్వం అవలంబిస్తోంది.