వలిగొండలో గోవుల అక్రమ రవాణా భగ్నం
24 గోవులను రక్షించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో గోవుల అక్రమ రవాణా కలకలం రేపింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 24 గోమాతలను బజరంగ్ దళ్ కార్యకర్తలు చాకచక్యంగా పట్టుకున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి బహదూర్పురా వైపు ఒక వాహనంలో ఈ గోవులను అత్యంత దారుణంగా, ఇరుకైన రీతిలో తరలిస్తున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన బజరంగ్ దళ్ కార్యకర్తలు వలిగొండ పట్టణంలో సదరు వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 24 గోవులు ఉన్నట్లు గుర్తించారు. గోవులను రక్షించిన కార్యకర్తలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి, వాహనంతో పాటు గోవులను వారికి అప్పగించారు. అనంతరం రక్షించిన 24 గోమాతలను సురక్షితంగా సంరక్షించేందుకు గాను యుగ తులసి ఫౌండేషన్ గోశాలకు తరలించారు.
ఈ అక్రమ రవాణాపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గోవులను ఎక్కడి నుండి తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రతినిధులు, గో సంరక్షకులు పాల్గొన్నారు.