పట్టిసీమ జలాలకు జలహారతి.. రైతులకు శాశ్వత నీటి హామీ: చింతమనేని
దెందులూరు నియోజకవర్గ రిపోర్టర్ పులువర్తి సంతోష్ కుమార్
దెందులూరు, జూలై 12: కృష్ణా డెల్టాకు పట్టిసీమ ప్రాజెక్టు జీవనాడిగా నిలిచిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందుచూపు నిర్ణయమే నేడు రైతాంగాన్ని ఆదుకుంటోందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.
పెదవేగి మండలం జానంపేట సమీపంలోని పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఆక్విడెక్ట్ వద్ద గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు విడుదలైన సందర్భంగా ఎమ్మెల్యే గోదావరి తల్లికి పసుపు, కుంకుమ సమర్పించి కర్పూర హారతులతో ఘనంగా జలహారతి నిర్వహించారు. రైతులు సమృద్ధిగా పంటలు పండించి సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు అందుతోందన్నారు. 2014లో తీసుకున్న పట్టిసీమ నిర్ణయం లేకపోయి ఉంటే నేడు డెల్టా ప్రాంతం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేదని చెప్పారు. పట్టిసీమ లేకుంటే కొన్ని గ్రామాల ప్రజలు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేదని వ్యాఖ్యానించారు.
పెదవేగి మండలంలో వర్షాభావంతో ఆయిల్ పామ్, కొబ్బరి తోటలు ఎండిపోతున్నాయని, ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే, శంకుస్థాపనలకే పరిమితమైన హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయని, ఇప్పుడు వాటి గురించి చెప్పేవారు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
తన ప్రస్తుత ఎమ్మెల్యే పదవీకాలంలోనే పెదవేగి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీటి భరోసా కల్పిస్తామని చింతమనేని ప్రకటించారు. పెదవేగి, కూచింపూడి, న్యాయంపల్లి, రాట్నాలకుంట, రాయన్నపాలెం గ్రామాలకు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
జలహారతి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిషోర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు బొప్పన సుధా, జలవనరుల శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.