సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు?.. సీఎం సంకేతాలతో రాజకీయ వేడి!
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఎన్నికలు ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా సిద్ధం కావాలని సీఎం సూచించారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఇదే అంశంపై మంత్రి పొంగూరు నారాయణ కూడా స్పందిస్తూ, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఎన్నికల యంత్రాంగం కూడా అందుకు అనుగుణంగా సిద్ధమవుతోందని పేర్కొన్నారు.
దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై రాజకీయ చర్చలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.