తెల్లవారుజామున విశాఖలో భూమి కంపనం.. ప్రజల్లో కలకలం
విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 5.05 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవ, తాటిచెట్లపాలెం తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా అనిపించినట్లు స్థానికులు తెలిపారు.
అధికారుల వివరాల ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో నమోదైంది. భూకంప కేంద్రం కాకినాడకు సుమారు 227 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో, 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. అయితే తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.