ఓటరు జాబితా సవరణకు ఇక మూడు రోజులే.. ఫారం సమర్పించండి: కలెక్టర్ లక్ష్మీశ
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల 14తో గడువు ముగియనున్న నేపథ్యంలో, ఇంకా ఫారం సమర్పించని ఓటర్లు వెంటనే తమ బీఎల్వోకు అందజేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
శనివారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో కలెక్టర్ పర్యటించి, ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటైజేషన్ పురోగతిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అధికారులు, బీఎల్వోలు, హెల్ప్డెస్క్లు ఓటర్లకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. శనివారం, ఆదివారం ప్రత్యేక శిబిరాలు కొనసాగుతాయని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో భాగస్వామి కావడం ద్వారా ఓటర్ల జాబితా మరింత ఖచ్చితంగా, దోషరహితంగా రూపొందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఫారాల సమర్పణలో ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఓటరు తన బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
82.15 శాతం డిజిటైజేషన్ పూర్తి
జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ కీలక మైలురాయిని చేరుకుంది. మొత్తం 14,07,640 ఫారాలు (82.15 శాతం) ఇప్పటికే డిజిటైజ్ అయ్యాయి.
నియోజకవర్గాల వారీగా డిజిటైజేషన్ పురోగతి:
తిరువూరు – 88.34 శాతం
విజయవాడ పశ్చిమ – 77.12 శాతం
విజయవాడ మధ్య – 78.43 శాతం
విజయవాడ తూర్పు – 79.42 శాతం
మైలవరం – 84.31 శాతం
నందిగామ – 84.81 శాతం
జగ్గయ్యపేట – 85.09 శాతం
జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా సాగుతుండగా, మిగిలిన ఓటర్లు కూడా గడువులోగా ఫారాలు సమర్పించి తమ ఓటు హక్కును భద్రపరచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.