స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
ప్రజావాణిలో GHMC అధికారులకు వినతిపత్రం
హైదరాబాద్, ఆగస్టు 17: ఎన్ టుడే న్యూస్.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల జీవనోపాధికి ఇబ్బందులు కలిగిస్తున్న ప్రైవేట్ రాంకీ సంస్థను రద్దు చేయాలని CITU డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం GHMC ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా CITU గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ స్వచ్ఛ టిప్పర్ ఆటో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి. రాములు, CITU నాయకులు ఎం. మహేందర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 వేల మందికి పైగా స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు అనేక సంవత్సరాలుగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు.
ఇంటింటి నుంచి చెత్త సేకరణతో పాటు షాపింగ్ మాల్స్, పెద్ద హోటళ్ల నుంచి కూడా చెత్త సేకరిస్తూ కొంత అదనపు ఆదాయం పొందుతున్నారని చెప్పారు. అయితే, ప్రైవేట్ రాంకీ సంస్థ పెద్ద షాపింగ్ మాల్స్, హోటళ్ల నుంచి చెత్తను తామే సేకరించాలంటూ నోటీసులు జారీ చేసి చెత్త సేకరణ చేపడుతోందని ఆరోపించారు.
దీంతో ఎన్నో సంవత్సరాలుగా చెత్త సేకరణపై ఆధారపడి జీవిస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల ఆదాయానికి గండిపడుతోందని, వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల జీవనోపాధిని కాపాడేందుకు రాంకీ సంస్థను రద్దు చేయాలని, షాపింగ్ మాల్స్, పెద్ద హోటళ్లలోనూ స్వచ్ఛ ఆటో కార్మికులే చెత్త సేకరించుకునేలా GHMC అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లపై అధికారులు స్పందించకపోతే స్వచ్ఛ ఆటో కార్మికులు కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చి GHMC కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అనంతరం GHMC ప్రజావాణిలో అడిషనల్ కమిషనర్ రవి కిరణ్కు CITU బృందం వినతిపత్రం అందజేసింది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన సానుకూలంగా స్పందించినట్లు CITU నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆటో కార్మికులు నల్లబోతుల కురుమయ్య, కళ్యాణ్ చిరంజీవి, సైదులు, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.