మదనపల్లెలో గంజాయి స్మగ్లర్పై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్
మదనపల్లెలో గంజాయి స్మగ్లర్పై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్
మదనపల్లె, అన్నమయ్య జిల్లా: మదనపల్లెలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న సయ్యద్ సుల్తాన్పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలో రెండో వ్యక్తిగా అతడిపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రయోగించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. అనంతరం నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సయ్యద్ సుల్తాన్పై గతంలోనే 18 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతడి నుంచి మొత్తం 51.915 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మాదకద్రవ్యాల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం. వెంకటాద్రి, సీఐలు రాజారెడ్డి, వెంకట రమణ, ఎస్ఐలు రామకృష్ణారెడ్డి, రహీముల్లా తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.