కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి బీఆర్ఎస్ మధిర నాయకుల డిమాండ్
మధిర, ఆగస్టు 17:
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాల అమలులో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మధిర తహసీల్దార్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పథకాల అమలుపై న్యాయపరమైన సమస్యలు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పేదల సంక్షేమానికి సంబంధించిన పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే ప్రజలను కలుపుకొని ఉద్యమిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిక్కీ కృష్ణ ప్రసాద్, చిత్తారు నాగేశ్వరరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, అరెగ శ్రీనివాసరావు, ఆళ్ల నాగబాబు, బొగ్గుల వీరారెడ్డి, చీదిరాల రాంబాబు, వేల్పుల శివ, నీలం రమేష్, మార్త అప్పారావు, అబ్దుల్ ఖురేష్, వేల్పుల శ్రీను, అంగడాల గోపి తదితరులు పాల్గొన్నారు.