సైదాబాద్లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత
సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ దాడి.. గోదాంలో అక్రమంగా నిల్వ చేసిన బియ్యం స్వాధీనం
సైదాబాద్,/ ఎన్ టుడే న్యూస్:
పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచిన ఘటన సైదాబాద్లో వెలుగుచూసింది. సైదాబాద్ రెడ్డి కాలనీలోని ఓ గోదాంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంపై సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసి 98 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
సివిల్ సప్లై చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సి. శశిధర్ రాజు ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ అజయ్ బాబు, సబ్ఇన్స్పెక్టర్లు పి. శ్రీశైలం, ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ దాడి నిర్వహించారు.
అధికారుల వివరాల ప్రకారం.. సైదాబాద్లోని పూసలబస్తికి చెందిన హరీష్ రెడ్డి గత కొంతకాలంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తున్నట్లు గుర్తించారు. రెడ్డి కాలనీలోని వాటర్ ప్లాంట్ పక్కన ఉన్న గోదాంలో బియ్యాన్ని నిల్వ చేసి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
దాడిలో సుమారు 98 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిని తదుపరి విచారణ నిమిత్తం సైదాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రెడ్డి కాలనీలో ఈ అక్రమ బియ్యం వ్యాపారం కొంతకాలంగా కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్న నేపథ్యంలో అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, నిల్వలు, తరలింపుపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. అక్రమ బియ్యం దందాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.