కళ్యాణలక్ష్మి పథకాన్ని ఆపే కుట్ర : డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కళ్యాణలక్ష్మి పథకాన్ని ఆపే కుట్ర : డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిలుపుదల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పథకాల నిలుపుదలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సోమవారం నల్గొండ, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసిన ప్రవీణ్ కుమార్.. కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళ్యాణలక్ష్మి పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేసినప్పటికీ, నెల రోజులు గడిచినా ప్రభుత్వం తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై ప్రశ్నించారు.
కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసినా లా సెక్రటరీ, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్కు కౌంటర్ దాఖలు చేయాలని ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. పథకానికి నోడల్ శాఖ బీసీ సంక్షేమ శాఖ అయినప్పటికీ, కోర్టు కేసుపై సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి పేరావైజ్ రిమార్కులు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు.
కళ్యాణలక్ష్మి పథకం ద్వారా గతంలో సుమారు 13 లక్షల మంది లబ్ధి పొందారని, బాల్య వివాహాలను నిరోధించడంతో పాటు పేద కుటుంబాలు వివాహాల కోసం అప్పుల పాలుకాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మహిళలు తులం బంగారం కోసం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారికి సమాధానం చెప్పలేక పథకాన్నే నిలిపివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ప్రభుత్వం పథకాలపై సీరియస్గా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని విమర్శించారు. హైకోర్టులో కేసు నమోదైన వెంటనే సంబంధిత ప్రభుత్వ శాఖలు, అధికారులకు సమాచారం అందుతుందని, ప్రభుత్వం నిజంగా సీరియస్గా ఉంటే వెంటనే కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు.
హైకోర్టు కౌంటర్ దాఖలు చేసేందుకు పలుమార్లు అవకాశం ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు.
కళ్యాణలక్ష్మి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సైతం ప్రశంసించాయని ప్రవీణ్ కుమార్ తెలిపారు. పథకం ద్వారా నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సహాయం అందుతుందని, మధ్యవర్తులు, బ్రోకర్లు, కమీషన్లకు అవకాశం లేదన్నారు. వివాహ కార్డు, వయస్సు, ఆదాయ ధృవీకరణ వంటి పత్రాలను పరిశీలించిన తర్వాతే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని వివరించారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పథకాల నిలుపుదలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.