www.ntodaynews.com
గంగమ్మ జాతరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
తెలంగాణ
పుంగనూరు గంగమ్మ జాతరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘాలో వేడుకలు
NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు
పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు.
జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పరిశీలించి మీడియాతో మాట్లాడారు. జాతర ప్రాంతంలో అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు.
జాతర రద్దీని ఆసరాగా చేసుకుని జరిగే పిక్పాకెటింగ్, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలను అరికట్టేందుకు అనుభవజ్ఞులైన క్రైమ్ పార్టీలను నియమించారు. ఇప్పటికే నాలుగు ప్రత్యేక క్రైమ్ టీమ్స్ పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని వెల్లడించారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడంతో పాటు రాకపోకలకు మార్గమార్పులు అమలు చేస్తామని తెలిపారు. భక్తుల క్యూలైన్లను క్రమబద్ధీకరించేందుకు అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు.
మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి టీమ్స్ను రంగంలోకి దించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆలయం సమీపంలో ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ మరియు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని భక్తులను కోరారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి రౌడీ షీటర్లకు ముందుగానే కౌన్సెలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. జాతర సమయంలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసు మరియు అబ్కారీ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తాయని చెప్పారు.
భక్తులందరూ పోలీసులకు సహకరించి జాతరను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐ అన్సర్ భాష మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
#Punganur #GangammaJatara #AnnamayyaDistrict #PoliceSecurity #DheerajKunubilliIPS #AndhraPradeshNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube