ఆరోగ్యశ్రీ బకాయిలపై ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రుల లేఖ
ఆరోగ్యశ్రీ బకాయిలపై ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రుల లేఖ
అమరావతి, ఆగస్టు 5: ఆరోగ్యశ్రీ పథకం కింద పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. సమ్మె సమయంలో ప్రతినెల రూ.170 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు ఆ మేరకు నిధులు విడుదల చేయలేదని లేఖలో పేర్కొన్నాయి.
ప్రభుత్వం భారీగా బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించడం, మందులు, శస్త్రచికిత్సలకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయడం తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆస్పత్రుల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఐదు ప్రధాన డిమాండ్లను ఉంచాయి. తక్షణమే రూ.600 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ప్రతి నెల చెల్లింపులను క్రమబద్ధంగా నిర్వహించాలని కోరాయి. మిగిలిన బకాయిల విడుదలకు స్పష్టమైన కాలపరిమితితో కూడిన షెడ్యూల్ ప్రకటించాలని, సమస్యల పరిష్కారానికి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి.
అలాగే, పెండింగ్ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు హెచ్పీఆర్కు అనుసంధానమైన ఉచిత అనుమతుల ప్రక్రియను నిలిపివేయాలని కూడా నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.